Saturday 19 April 2014

Sutras : 72 & 73



72వ సూత్రం:- నాస్తి తేషు జాతి విద్యారూపకుల ధనక్రియాది భేదః  
          ఇటువంటి ఉత్తమ భక్తులలో కుల, మత, రూప, విద్య, ధనం, వృత్తి మొదలైన వాటిలో వ్యత్యాసాల వల్ల కలిగే ఏ భేదాలు ఉండవు. వీరు అందరిలోను ఆ పరమాత్మను తప్ప అన్యం ఏమీ చూడరు. ఇటువంటి భేదభావాలన్నీ మనమే మన మనసులలో సృష్టించుకోవడం వలన అవి నిజాన్ని మరుగుపరుస్తాయి.
          మనం లౌకిక విషయాలలో శరీర-మనో-బుద్ధి స్థాయిలో స్పందించడమే దీనికి కారణం. ఇవి మనలో పరిచ్ఛిన్నభావాన్ని కలుగచేస్తాయనడంలో సందేహం లేదు. అందువల్లనే ముందుగా మన దృష్టి కోణం మారాలి.
ఆధ్యాత్మికతలో గుణానికి, కర్మకే ప్రాధాన్యం కాని, భేదభావానికి తావే లేదు. ఈ సత్యాన్ని మనమందరం గ్రహించాలనే సదుద్దేశంతో మాత్రమే వారు మన వద్దకు వస్తారు.
ఉత్తమ భక్తులు ఈ స్థాయిని దాటి ముందుకు సాగుతారు. కాబట్టి వారిలో సత్యాన్ని గురించిన అపోహలు, ఎటువంటి భేదభావాలు ఉండవు. వారు అందరిలోనూ భగవత్ స్వరూపాన్ని దర్శించగలరు. శాస్త్రం కూడా ఇటువంటి భేదాల్ని ఒప్పుకోలేదు.
 ఉదా శబరి, భక్త కన్నప్ప, తుకారాం, తులసీదాస్, మాల పిచ్చమ్మ మొదలైన వారు ఈ కోవకి చెందిన భక్తులు.
ఒక సాధకుడిగా ఈ సూత్రం నుండి నేర్చుకోవలసినది, నాలో ఉన్న అహంకారాన్ని వదిలి, పరమాత్మ కోసమే పనులు చేయడంలో నిమగ్నమవ్వాలి. ఎటువంటి భేదభావాలు లేకుండా అందరితో కలసి పని చేయడం వలన, అన్నీ సక్రమంగా జరుగుతాయి.
ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకే రకంగా ఉండరు, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్రజ్ఞ (టాలెంట్) ఉంటుంది. దానిని గుర్తించి, వారినుండి నేర్చుకోగలిగే ప్రయత్నం చేయాలి కాని వారిలో చెడును వెదుకుతూ పోకూడదు. అటువంటపుడే  మనం అందర్నీ ప్రేమగా, సమానంగా చూడగలిగి, జీవితంలో ఉన్నత స్థితికి చేరగలుగుతాము.
          ప్రేమ, ద్వేషం ఒకే చోట ఉండలేవు. నేను అందర్నీ ప్రేమగా చూడలేక పోతున్నాను అనుకున్నప్పుడు, దాని కోసమైన భక్తిని నెరపాలి.
          మనకు ఏదైనా (వస్తువు) కావాలనుకున్నప్పుడు, దాని కోసమై కష్టపడతాం. మరి, నాలోనే ఉన్న ఆ పరమాత్మకై ప్రయత్నిస్తే ఆయన తప్పక వస్తాడు. (మనం కావాలనుకున్న దానిని (కోరుకున్నది) సాధించుకోడానికి చేసే ప్రయత్నం, మనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకోడానికి చేస్తే, ఆయన తప్పకుండా మనకు చేరువౌతాడు.)
          నా హృదయంలోనే ఉన్న పరమాత్మకోసం సిగ్గువిడిచి నృత్యం, పాడడం చేయగలగాలి. యోగుల హృదయాలలోనే కాదు, నా భక్తులు నన్ను కీర్తించిన చోటే నేను నివసిస్తాను, అని ఆ పరమాత్మే స్వయంగా చెప్పాడు. నేను ఉత్తమ భక్తునిగా మారాలి అనుకుంటే, ఎల్లవేళలా ఆ పరమాత్మను నామనసులో నిలుపుకోగలుగుతున్నానా, లేదా నా మనసు అన్య విషయాలవైపు మరలుతోందా అనేది ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి.
          మనం ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించడం వల్ల, అది మనకు స్ఫూర్తినివ్వడమే కాక, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. భక్తి మన వ్యక్తిత్వాన్ని ప్రేమ మయం చేస్తుంది. జ్ఞానం మనకు సత్యాన్ని తెలియచేస్తుంది. ఈ బంధాలన్నిటినుండి బయట పడగలిగినపుడే మనకు ముక్తి సాధ్యమౌతుంది. భేదాలన్నింటిని వదలి, అందరినీ ఒకే విధంగా ఎలా చూడగలము, అని ఇంకా మనకు సందేహం ఉన్నట్లయితే దానిని గూర్చి నారదుల వారు తర్వాతి సూత్రంలో విశదీకరించారు. కర్మలో చిన్న, పెద్ద తేడాలు, శ్రేష్ఠ, కనిష్ఠాలు ఉండవు. ఎందుకంటే...
73వ సూత్రం:- యతస్తదీయాః
          అటువంటి ఉత్తమ భక్తులందరూ భగవంతుని స్వరూపమై ఉన్నారు కాబట్టి, వారికి భేదాలు కనిపించవు. అందరూ భగవత్స్వరూపమేనని వారికి తెలుస్తుంది. ఉదా నా చేతికి ఉన్న ఐదు వేళ్ళు నాకు సమానమే. ఎందుకంటే అవి అన్నీ నా శరీరానికి సంబంధించినవే కాబట్టి, ఏ ఒక్కటి ఎక్కువా కాదు, తక్కువా కాదు.
అదే రకంగా ఉత్తమ భక్తులకు దేనిలోను భేదం కానరాదు. వారు ఆచరించే మార్గాలు వేరైనా, గమ్యం ఒకటే. అట్టి అత్యున్నత స్థాయిని చేరనివారికే వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఉత్తమ భక్తుని మనసు భగవదాకారం దాల్చి, వారి వ్యవహారం కూడా అన్యమైన ఆలోచనలు లేకుండా పరమాత్మతో నిండి ఉంటుంది. అటువంటి వారు ప్రతిక్షణం భగవద్రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.
          కాబట్టి వారిలో ఎవరు గొప్ప భక్తుడు? అన్న ప్రశ్న వారికి రానే రాదు. ఈ ప్రశ్న జనించేది ఇంకా పరిపక్వత నొందని వారిలోనే.

No comments:

Post a Comment