67వ సూత్రం:- ॥భక్తా ఏకాన్తినో ముఖ్యాః ॥
భక్తులలో
రెండు రకాలుంటారు. మొదటి రకానికి చెందిన భక్తులు భగవంతునితో పూర్తిగా తాదాత్మ్యం చెంది, ఏ బంధాలు లేకుండా నిర్మలంగా ఉంటూ, ఏ విధమైన కోరికలు లేకుండా ఉంటారు. రెండవ
రకానికి చెందిన వారు తమ సాధన ద్వారా భక్తిని పెంపొందించుకొని ఉన్నత శ్రేణి
భక్తులుగా మారతారు.
నారదులవారు
మహాభక్తుని గూర్చి చెపుతున్నారు. ‘ఏకాన్తినః’- ఆ పరమాత్మయే ఏకైక లక్ష్యంగా (గమ్యంగా) కలిగిన వాడే సర్వోత్తమమైన భక్తుడు.
అన్య చింతన లేకుండా అతని సర్వశక్తులూ పరమాత్మ కోసమే వినియోగిస్తాడు. అతని హృదయంలో
ఆ పరమాత్మపై ప్రేమ తప్ప, ఇంకేమి
ఉండదు. మనో బుద్ధుల పరంగా కూడా పరమాత్మతో ఒక్కటై,
భక్తి విశ్వాసాలు కలిగి ఉంటాడు. భగవంతునితో ఐక్యం కావడమే అతని
జీవిత పరమావధి.
ఉదా॥ ఒక
సంత్మహరాజ్ ఇల్లు మంటల్లో కాలిపోతూ ఉంటుంది. అందరూ వచ్చి మంటలు ఆర్పడానికి
ప్రయత్నించగా, ఆయన వద్దని వారిస్తాడు.
వారంతా అయోమయంలో పడి ఆయన ఎందుకు ఆగమన్నాడో అని ఆగుతారు. కొంతసేపటికి మంటల ఉధృతి తగ్గగా,
సంత్మహరాజ్, తానే
స్వయంగా మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తాడు,
అప్పుడు అందరూ ఆయనను,
“మా అందర్నీ వారించి ఇప్పుడు మీరెందుకు
మంటలనార్పడానికి ప్రయత్నిస్తున్నారు?” అని అడుగగా,
ఆయన, అప్పుడు
“భగవంతుని నిర్ణయం ప్రకారం కాలాలని ఉంది, కనుక మిమ్మల్ని ఆపడం ద్వారా దానికి సహకరించాను.
ఇప్పుడు మంటల ఉధృతి తగ్గి ఆరడం మొదలైంది. కాబట్టి,
పరమాత్మ నిర్ణయం ప్రకారం ఆయనకు సహకరించాలనుకుంటున్నాను” అన్నారు. తరిగొండ వేంగమాంబ, మీరాబాయి
మొదలైనవారు ఈ కోవకి చెందిన భక్తులు.
ఇటువంటి
భక్తుని వల్ల ముల్లోకాలు ఆనందిస్తాయి. రతి,
గతి, క్రియ, ప్రియ మొదలైన
వాటన్నింటిలోనూ
ఒక్కటిగా ఉన్నవాడు, తన
స్వంతం అనేది ఏదీ లేకుండా ఉంటాడు. తనకు నియంత,
రక్షకుడు, స్వామి
అన్నీ ఆ పరమాత్మే అనుకొని, హృదయంలో
ఆయనతో విడదీయరాని బంధం కలిగి ఉంటాడు. అటువంటి భక్తుడు “ఆ పరమాత్మ తప్ప నాకు ఎవరూ లేరు, నేను
ఆయనకు మాత్రమే చెందుతాను, ఆయన
నా వాడు” అని భావిస్తూ,
భక్తి మార్గంలో ఇంకా ఎదిగిన కొద్దీ “నీవు నేను ఒకటే, నా
కన్నా నీవు అన్యం కాదు”, అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. ఇటువంటి వారు ‘మోక్షకాంక్ష’ కూడా లేకుండా,
నిరంతర ఆత్మ సాక్షాత్కారంతో జీవిస్తూ ఉంటారు.
అటువంటి మహాభక్తుల యొక్క ప్రవర్తన, మనస్థితి, వారి గొప్పతనం ఎలా
ఉంటుందో తర్వాతి సూత్రం (68) ద్వారా తెలుసుకుందాము.
68వ సూత్రం:- ॥కణ్ఠావరోధరోమాంచాశ్రుభిః
పరస్పరం లపమానాః, పావయన్తి కులాని పృధివీంచ ॥
మహాభక్తులైన
వారు భావోద్వేగంతో కూడిన కంఠస్వరంతో, వినీవినిపించనట్లుగా మాట్లాడుతూ, శరీరాలు పులకించి, రోమాంచమై, అశ్రుధారలు కారుస్తూ,
రసానుభూతిలో ఒకరితో ఒకరు వారి ఇష్ట దైవం గురించి
ముచ్చటించుకుంటారు. అటువంటి భక్తుల కలయిక మధురంగా
ఉంటుంది. వారి భావాలను మాటలలో వ్యక్తం చేయలేరు. ఆ సమయంలో వారి స్వంత
వ్యక్తిత్వం మాయమై, దైవాన్ని
మాత్రమే వారిలో నిలుపుతుంది. వారి దృష్టి అన్యంగా దేనిమీదికి పోక, నిశ్శబ్దంలో కూడా ఆ బ్రహ్మానందానుభూతిని
మాత్రమే ఆస్వాదిస్తుంటారు. ఇటువంటి వారి వలన భూలోకం మొత్తం పావనమౌతుంది. ఉదా॥ ‘రామకృష్ణ
పరమహంస’
ఇటువంటి
వారి సామీప్యంలో ఉంటేనే ఆ అనుభూతి దానంతట అదే కలుగుతుంది.
వారి
ఉనికి వలన వారి కుటుంబాలకు, కులానికి
కీర్తి ప్రతిష్ఠలు లభించడమే కాక, భూమాత
కూడా పవిత్రం అవుతుంది. అట్టివారు పరిపూర్ణ హృదయులు.
అహాన్ని
మూలంతో సహా నశింపచేసి, బ్రహ్మానుభూతిని
పొందిన అటువంటి మహాత్ములు ఉండడం ఈ భువికి గొప్పవరం. పరమాత్మను గూర్చి
బోధిస్తున్నప్పుడు ‘ప్రేమ’ తప్ప, వేరే ఏ విధమైన భావన వారిలో
కానరాదు. ఒక్కొక్కసారి తనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనా వాటిని లెక్కచేయక, తాను ఏమి చేస్తున్నా ఆ నారాయణుడి కోసమే అనే
భావంతో ముందుకు సాగుతాడు. భగవత్సాక్షాత్కారాన్ని పొందిన ఇటువంటి భక్తులలో అందరి
పట్ల సోదరభావం నెలకొని ఉంటుంది. “శ్రేష్ఠత భక్తిలో కాని
కులంలో కాదు”.
మనం ఇంకా సాధకుని స్థాయిలోనే ఉన్నాం కాబట్టి, ‘ఇటువంటి భక్తులలో బేధాలు ఉంటాయా!’ అనే సందేహం కలుగవచ్చు. దీనికి సమాధానంగా తదుపరి సూత్రం (72) ఇవ్వబడింది.
No comments:
Post a Comment