84వ సూత్రం:- ॥ త్రి సత్వస్య భక్తిరేవ గరీయసే, భక్తిరేవ గరీయసే ॥
అర్థం:- మూడు సత్యములలోనూ భక్తి ఒక్కటే
శ్రేష్ఠమైనది.
మూడు సత్యములు అంటే 3 కాలాలు లేక
3 అవస్థలు లేక 3 మార్గాలు. భక్తి వల్ల
ప్రేమ జనిస్తుంది. ఇది సేవ రూపంలో ఉంటుంది. భక్తి వల్ల
ప్రారబ్ధకర్మలు కూడా తొలగింపబడతాయి. భక్తి ఏ కాలానికైనా తగినదే, అందరూ దీన్ని
అనుసరించడం ప్రారంభించవచ్చు! భక్తిలో ఏ ప్రతికూల ప్రభావము లేదు. ఎటువంటి
పరిస్థితులలో ఉన్న వారికైనా, ఎటువంటి పరిసరాలలో ఉన్నప్పటికీ, వారి జీవన
స్థితిగతులు ఏ రకంగా ఉన్నప్పటికీ, భక్తి మార్గాన్ని అవలంబించడం ద్వార
పరమాత్మను చేరుకోగలరు. అందుకే ఇది అన్నింటికన్నా శ్రేష్ఠం అని నారదులు
వారు మళ్లీ, మళ్లీ నొక్కి వక్కాణించారు.
58వ సూత్రం:- ॥ అన్యస్యాతే సౌలభ్యం భక్తౌ॥
అర్థం:- అన్ని మార్గాలకన్నా భక్తి సులభతరమైనది.
మిగిలిన అన్ని మార్గాలకన్నా, భక్తిమార్గం
సులువుగా లభ్యం అవుతుంది. భక్తి మార్గం ఆచరించడం ద్వారా పరమాత్మను
తప్పకుండా చేరవచ్చని నారదుల వారు చెబుతూ మనకు ఆశను, ధైర్యాన్ని
ఇస్తున్నారు.
సాధకుడు తామసికుడైనా, రాజసికుడైనా, సాత్విక
స్వభావాన్ని పొంది/ చేరి పరమాత్మను చేరవచ్చు. భక్తిమార్గంలో
ఏ విధమైన బేధభావాలు (ధనిక-బీద; కుల-మత; ప్రాంత
మొదలైన) ఉండవు. ఉదాహరణకు సాద్వి అయినా వేశ్య అయినా
పుత్రుని యందు తల్లులు చూపే ప్రేమ ఒక్కటే.
నిత్యనిరంతరమూ పరమాత్మను తలుస్తూ ఉండడం వల్ల, ఏ విధమైన
అర్హతలూ లేకున్నా ఆయన్ని చేరగలం. ఎవరైనా ఏ సమయములో, ఏ
పరిస్థితులలో ఉన్నా, ఎలా ఉన్నా భక్తి మార్గంలో పయనించడానికి అర్హుడే. సాధకునికి
భావన మాత్రమే ముఖ్యం మరేమి అక్కరలేదు.
భక్తి మార్గం
అన్నింటికన్నా సులువు అన్నారు. ప్రమాణం ఏమిటని
అనుమానం రావచ్చు.
59వ సూత్రం:- ॥ ప్రమాణాన్తర
స్యానపేక్షత్వాత్, స్వయం ప్రమాణత్వాత్ (చ) ॥
అర్థం:- భక్తి అనేది స్వయం ప్రమాణం కావడం వల్ల
వేరే ప్రమాణం మీద ఆధారపడి లేదు.
పరమాత్మ దరి చేర్చే ఆధ్యాత్మిక మార్గాలన్నింటిలోనూ భక్తి
మార్గమే సులభమైనది. ఇది వేరే దేనిమీదా ఆధారపడదు. భక్తిని
వెరే దేనివల్లా నిర్ధారించలేము. భక్తిని మనసులో నింపుకోవడానికి దేని
అవసరం లేదు. దానికదే ప్రత్యక్ష సాక్షి. భక్తిలో
విస్మరణ లేదు. అందరూ చేయగలిగినటువంటిది, సులువైనది. ఇందులో కాల
పరిమితులు ఏమి లేవు. భక్తివలన ఆపద ఉండదు.
ఏమైనా కావలసి వస్తే అది భావన మాత్రమే. స్వరూపాన్ని
బట్టి ఇది సులువుగా లభ్యం, ఫలితం కూడా ఎక్కువ. అజ్ఞానం
గాని, పూర్వజన్మ కర్మలుగాని ఇవేవి భక్తిపై తమ ప్రభావం చూపలేవు. భక్తిలో
ప్రగాఢత ఉండాలి. ఉ॥ శబరి, హనుమ
మొదలైనవారు.
భగవంతుడు ఎటువంటి జన్మనిచ్చినా, అది భక్తికి అడ్డురారు. ప్రేమ అందరిలోనూ ఉన్నప్పటికీ, దాన్ని మిగతా విషయాలపై నుంచి పరమాత్మపై కేంద్రీకరించాలి. అదే భక్తి మార్గం.
No comments:
Post a Comment