Friday 21 March 2014

Sutras : 66 & 71



66వ సూత్రం:- త్రిరూపభంగ పూర్వకం, నిత్యదాస, నిత్యకాంతాభజనాత్మకం ప్రేమకార్యం ప్రేమైవ కార్యమ్
          సాధారణంగా సాధకునిలో ఉండే త్రిగుణాత్మకమైన (సత్వం, రజస్సు, తమస్సు) భక్తిని దాటి, ఎప్పుడూ దాసునిలా, ధర్మపత్నిలా సేవిస్తూ, ప్రేమను మాత్రమే అందరికీ పంచే విధంగా తన భక్తిని పెంపొందించుకోవాలి.
          ఈ రకమైన భగవద్భక్తిలో సాధకుని మార్గం, గమ్యం కూడా ఒకటే అయి, చివరికి కర్త, కర్మ, క్రియ అనే తేడా లేనటువంటి ప్రశాంతమైన మనః స్థితికి చేరుకుంటాడు. ఇదే పూర్ణానుభూతిని పొందిన మోక్షస్థితి.
          అటువంటి ఉత్కృష్టమైన భక్తిని నెరపడానికి, నిత్యదాస - ఒక సేవకుడు తన యజమానిని ఎంత గౌరవ, విశ్వాసాలతో సేవిస్తాడో, నిత్యకాంత - అంటే భార్య భర్తను విశ్వాస గౌరవాలతో మాత్రమే కాక, అతడిని స్వంతంగా భావించి సమర్పణా భావంతో, ప్రేమను అందించగలుగుతుందో, అదే విధంగా, పూర్ణమైన అంకితభావంతో, తన కర్తవ్యాన్ని వదిలివేయకుండా ప్రేమతో పరమాత్మ దరి చేరాలి.
          సేవకునికి ఈ రెండు ప్రత్యేక లక్షణాలు (ప్రేమ, సమర్పణభావం) ఉండనవసరం లేదు. కొందరు శ్రద్ధా, విశ్వాసాలతో సేవిస్తే, మరికొందరు వాటితో పాటు ఇది నా స్వంతం, నేను, వారు వేరు కాదు, ఒక్కటే అనే తాదాత్మ్య భావంతో సేవిస్తారు.
          ప్రేమ ఉన్నచోట, విస్మరణకు తావు లేదు. ఇటువంటి భక్తిలో రూపం తొలగిపోయి, పరమాత్మ-నేను వేరు కాదు, ఒక్కటే అన్న భావం కనిపిస్తుంది.
          కాని సాధకుడు ఆ పూర్ణస్థితిని చేరలేదు కనుక ఈ అరిషడ్వర్గాల వల్ల విస్మరణ అనేది సంభవిస్తూ ఉంటుంది. మనసును పరమాత్మ వైపు మరల్చడం ద్వారా పరిశుద్ధం చేయవచ్చు. అదే వేరే వస్తువుల వైపు మళ్ళితే మలినం అవుతుంది. మన మనసులో.
భావనను పరమాత్మవైపు మళ్ళించగలిగితే, ఆయనే మన దరికి వస్తాడు. అందులో ఆయనకు ఎటువంటి తేడాలు ఉండవు. ఎటువంటి పరిస్థితులలోనూ పరమాత్మను విస్మరించకుండా, ఉంటూ, మనలో ఉన్న అభిమానం, అహంకారం వంటి గుణాల్ని కూడా ఆయన వైపు మళ్ళించాలి. అభిమానం ఉన్నచోట ఆలోచనలు సంకుచితమై, ఒకే రూపం, సేవ, ఇదంటేనే ప్రేమ అనే భావం ఉంటే పరమ్నాత్మ దానిని తొలగిస్తాడు.
          సేవకి రూపంతో సంబంధం లేదు. అలా ఉన్నట్లయితే అది ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేసినదే అవుతుంది. ప్రేమలో గిరి గీసుకుని కూర్చోవటం ఉండదు. నేను ఈ పనే చేస్తాను, ఇంతే చేస్తాను; అది నా బాధ్యత కాదు, వారు పని చేయలేదు నేనెందుకు వారి పని చేయాలి? అలా ఉంటే మనకి అభిమానం ఉన్నట్లే. అభిమానం ఉన్న చోట ప్రేమకు తావు లేదు.
          పరమాత్మను పై రెండు విధాలుగా (ప్రేమ, సేవ) ఎలా సేవించినప్పటికీ, ముఖ్యంగా పరమాత్మకు, నీకు మధ్య దూరం ఉండకూడదు. సాధించాల్సినదల్లా ప్రేమ ఏవ కార్యం. పరమాత్మతో ప్రేమను నెరపాలి. అదే ఉత్కృష్ట స్థాయి.
          కాని, మొదట ప్రేమ ఎలా జనిస్తుంది? అనే సందేహం మనకు కలుగుతుంది. కారణం లేనిదే కార్యము ఉత్పన్నమవదు. కనుక మనలో ప్రేమ ఉత్పన్నమవడానికి మనకు వారిపట్ల గుణమహాత్మ్యా జ్ఞానం (గుణగణాలు, మహాత్మ్యం తెలియాలి), సంబంధ జ్ఞానం (వారితో ప్రత్యేకమైన సంబంధం ఏర్పరచుకోగలిగి ఉండటం), సేవా జ్ఞానం (ఇది సేవ రూపంలో ఉంటుంది) కలిగి ఉండాలి.
          ఏ పని చేస్తే పరమాత్మ (అవతలివారు) ప్రసన్నమౌతాడో అదే ప్రేమ. భజన కూడా రసాస్వాదన చేస్తూ చేయాలి. రసాస్వాదనకు పరిధులు లేవు.
          ఈ విధంగా ఇప్పటి వరకు చూచిన సూత్రాల రూపంలో భక్తిని గూర్చి నారదులవారు మనందరికీ చాలా చక్కగా విశదపరచారు. ఇంతటితో భక్తి ప్రకరణం సమాప్తమైంది. ఇప్పటివరకు భక్తి యొక్క పరాకాష్ఠ చూశాము. భక్తికి ప్రేమయే అత్యుత్తమమైన మార్గమని తెలిసింది.
భక్త ప్రకరణం
          ఉత్తమ భక్తుని యొక్క మాహాత్మ్యాన్ని తెలియ చేసేదే ఈ భక్త ప్రకరణం. అతడిని స్థిత ప్రజ్ఞుడిగా, జ్ఞానిగా అభివర్ణించవచ్చు. ఇప్పుడు ఉత్తమ భక్తుడంటే ఎవరో, నేను ఎందుకు భక్తుడు కావాలో అన్నది తెలుసుకుందాము.
          ఉత్తమ భక్తునిలో భక్తి; ప్రేమ, సేవల రూపంలో ఉపాధుల ద్వారా వ్యక్తమౌతుంది. ప్రేమ, సేవ కూడా ఆయన సహజ లక్షణాలే. వారు వాక్ రూపంలో అందరిలో ఉన్న పరమాత్మను పూజిస్తూ ప్రేమిస్తారు, స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం సేవయే.
పరమాత్మను ఎందుకు ప్రేమించాలంటే, అది (ప్రేమ) తన సహజ స్వరూపం కనుక.
          భక్తిలో తిరస్కార భావం ఉండదు. ఉత్తమ భక్తుని సేవకు ఎప్పుడూ సంతృప్తి అనేది ఉండదు. అటువంటి ఉత్తమ భక్తులను, వారి శారీరిక, మానసిక స్థితి, వారి లక్షణాలను గూర్చి, వారి సాధన ఏ విధంగా ఉంటుందో, ప్రేమ వారి నుండి ఎలా వ్యక్తమౌతుందో, వీటన్నిటినీతెలిపేదే ఈ భక్త ప్రకరణం.
71 సూత్రం:- మోదంతే పితరౌ నృత్యంతి దేవతాః
సనాధా చేయం భూర్భవతి
          భక్తిని సంపూర్ణంగా మనసులో నింపుకున్న భక్తుల వల్ల వారి పితృదేవతలు సంతృప్తి చెందుతారు. దేవతలు సంతుష్టులై నృత్యం చేస్తారు. మన సంస్కృతి, సంప్రదాయాలను రక్షించేవాడిగా ఉండడం వల్ల భూమాత కూడా చాలా ఆనందిస్తుంది.
          భక్తితో హృదయం ఉప్పొంగే స్థితికి భక్తుడు చేరినప్పుడు, దేహం ఆనంద పారవశ్యంతో రోమాంచమై, మాటలురాని అనుభూతితో ఆనందాశ్రువులు స్రవించే స్థితిని పొందుతాడు. ఇటువంటి భక్తులు తమ భక్తి ప్రాబల్యంతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తారు.
          అటువంటి వ్యక్తికి ముందు, వెనుక ఉన్న ఏడు తరాల వారందరూ తృప్తి పొందుతారు. ఆధ్యాత్మిక జీవనం గడపడానికి శ్రద్ధతో ప్రయత్నించిన సాధకులు, గతించిన మహర్షుల కృషి, త్యాగాల ఫలితంగా, ఈ ఉత్తమ భక్తుడు సత్యాన్ని గ్రహించగలిగాడని వారందరు సంతోషిస్తారు. ఉత్తమ భక్తుడిని ఏ ఋణాలు అంటుకోవు.
ఇక్కడ దేవతాః అంటే సత్పురుషులు అని అర్థం. అంటే వివిధ రూపాలలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపాలే, మన శరీరంలో అధిష్ఠాన దేవతల రూపంలొ ఉంటారు. అద్భుతం జరిగినప్పుడు దేవతలు నృత్యం చేస్తారు. ఉదాహరణకి కంటికి అధిష్ఠాన దైవం సూర్యుడు. ఉత్తమ భక్తుని కంటి ద్వారా ఆ పరమాత్మ దర్శనం కలగడం వల్ల, సూర్యుడు సంతృప్తి నొందుతాడు.
          భూఃఅంటే భూదేవి, విష్ణుసతి. ఆమె తనమీద నివసించే మనుషుల స్వార్ధం వల్ల కళావిహీనంగా ఉంటుంది. ఆమెకు సంరక్షకుడు లభించినప్పుడు, ఇక మీదట ఆమె భర్తృహీన కాదు, విధవ కాదు, సనాథ అవుతుంది. ఉత్తమ భక్తుడు ఉన్న చోట భగవంతుడు ఉండడం వలన భూదేవి తన దేవుడు మళ్ళీ లభించడంతో చాలా సంతోషిస్తుంది. ఉత్తమ భక్తుడు తన జ్ఞానం, చైతన్యంతో పరిసరాలను ప్రభావితం చేస్తాడు. తన ధర్మ ప్రవర్తనతో, అధర్మాన్ని నిర్మూలించి మానవత్వాన్ని  పునరుద్ధరిస్తాడు.
          ఆత్మసాక్షాత్కారం పొందిన భక్తుని వలన తన పితరులందరికీ హృదయ పరివర్తన కలిగి, తరిస్తారు.
          ఇటువంటి ఉత్తమ భక్తులు పరమాత్మ మహాత్మ్యాన్ని ఆనందంగా గానం చేస్తూ, తన పరిసరాలలోని మనుషులను ప్రభావితం చేస్తారు. ఉ ప్రహ్లాదుని కారణంగా అతని 7 తరాలు తరించేలా లక్ష్మీనరసింహుడు వరమిచ్చాడు.
          వీరి స్వరూపం ఎలా ఉంటుందో, సర్వోత్తమమైన భక్తుడు ఎవరో రాబోయే (67) సూత్రంలో తెలుసుకుందాం.

No comments:

Post a Comment